18/03/2020
క్రోధానికి లోనైతే జరిగే నష్టమేమిటో, వ్యామోహానికి లోనైతే జరిగే నష్టమేమిటో పరమాత్మ చాలా స్పష్టంగా ఉదాహరణలతో చెప్పారు. ఇప్పుడు మొదటి తప్పటడుగు ఎప్పుడు పడుతుందో, క్రమక్రమంగా ఎలా దిగజారిపోతారో, శ్రద్ధ కలిగినటువంటి ఉపాధ్యాయుడిలా చెబుతున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఒక అడుగు పడగానే కంగారు పడనక్కర్లేదు. ఎక్కడైనా జాగ్రత్త పడొచ్చు. 99వ తప్పు దగ్గర ఆగిపోయినా శిశుపాలుడి ప్రాణాలు దక్కేవి. ఇచ్చిన అవకాశాలన్నింటిని దుర్వినియోగం చేసుకుంటే అలాగే అవుతుంది.
‘ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి’ (భగవద్గీత, రెండో అధ్యాయం 62, 63 శ్లోకాలు)
ఓ మంచి దృశ్యం అనో, మంచి సుఖానుభూతి అనో.. విషయాల గురించి మనిషి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ‘అదే ధ్యాస’ అంటారు కదా! అది!! దానివల్ల ఆ విషయాల పట్ల సాంగత్యం ఏర్పడుతుంది. ఆ వస్తువు కావాలి, ఆ పదవి కావాలి అని కోరిక పుడుతుంది. ఈ కోరిక మూలంగా ఎక్కువ ఆలోచించడం మొదలవుతుంది. కోరిక పుట్టగానే అది తీరుతుందో, తీరదో అనే కంగారు మొదలవుతుంది. ఆ తరువాత క్రోధం వస్తుంది. కోరిక తీరకపోతేనే క్రోధం. తీరితే క్రోధం ఉండదు. క్రోధం వచ్చేసరికి మనిషిలో ఒక పట్టుదల ప్రవేశిస్తుంది. కోరిక తీరకపోతే ఉండలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాడు. దీన్నే ‘సమ్మోహం’ అంటారు.
ఆ సమ్మోహంలో బుద్ధిని కోల్పోతాడు. వివేకాన్ని కోల్పోతాడు. ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? అనే విషయాలు మరిచి ఎలాగైనా సరే అది సాధించాలనే తలంపులో అక్రమ మార్గాలకు, వక్రమార్గాలకూ ఒడిగడతాడు.
ఈ విషవలయంలోకి మనం పడకుండా ఉండాలంటే ఒక చక్కటి ఉపాయం ఉంది. దాన్ని ‘వైజయంతీ విలాసం’లో సారంగు తమ్మయ్య ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. ఈ విషయాల గురించి ఆలోచించేటప్పుడే, వాటి సాంగత్యంలో పడే సమయంలోనే పునరాలోచన చేస్తే ఇందులో పడకుండా ఉంటాం. ‘వైజయంతీ విలాసం’ విప్రనారాయణుడి కథ.
ఆయన ఒక గుళ్లో అర్చకుడు. అర్చకునికి కొన్ని నిబంధనలుంటాయి. అది అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చకుల దృష్టి వేరే స్త్రీ మీద ఉండకూడదు. పెళ్లయితే భార్య మీద తప్ప! అయితే ఊళ్లో దేవదేవి అనే వేశ్య పెద్ద సవాలు చేసి అతణ్ణి పడగొడతానని చెప్పింది. ‘నా సౌందర్యానికి దాసుడు కానివాడు ఈ ఊళ్లోనే లేడు’ అని సవాలు చేసింది. తరువాత రోజూ ఆయన దగ్గరకు రావడం, ఏవో ధర్మసందేహాలు అడగడం చేసింది. నెమ్మదిగా మాట కలపడం ప్రారంభించింది.
మాటిమాటికీ కలుస్తుంటే కోరిక పుడుతుంది కదా! అలాగే ఈయన మనస్సు కొంచెం చలించి, ఆమె యందు లగ్నమై, వ్యామోహానికి లోనయ్యే పరిస్థితి వచ్చింది. కానీ బ్రాహ్మణుడు, విష్ణు భక్తి కలవాడు కాబట్టి జాగ్రత్తపడ్డాడు. వెంటనే ‘‘దేవదేవీ! నువ్వు వేశ్వవి. నేను అర్చకుణ్ణి. మనం కలవడం తప్పు. వచ్చావు... ధర్మసందేహాలు అడిగావు. చాలు వెళ్లిపో! మీలాంటి వాళ్లు కలిస్తే మా మనసు పాడవుతుంది’’ అన్నాడు.
అప్పుడు దేవదేవి ‘మేం నాలుగు సార్లు కలిసి మాట్లాడితేనే మీరు నిగ్రహం కోల్పోతారా? అదేం నిగ్రహం’’ అంది. ఆ స్థితిలో ఆయన ఒక మాట అంటాడు. - ‘మొదటి మెట్టులోనే జాగ్రత్తగా ఉండాలి’ అని.
‘కాకులు రావిపళ్లు తిని గ్రక్క శిలామయ దేవమందిరా
నీకమునందు రావులు జనించును సజ్జన చిత్తవృత్తి అ
వ్యాకుల లీల రాతిగుడి వంటిది లోకములోని వేశ్యలున్
కాకులుల వంటి వారలు అటుగాన ప్రమాదము చేరనిచ్చినన్’
ఈనాడు చదువుకుంటూ ప్రేమవ్యవహారాల కారణంగా ప్రేమ సఫలం కాక, అటు చదువు పాడయి, ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్న వారికి గొప్ప గుణపాఠం ఈ పద్యం. ‘దేవాలయం చుట్టూ ఉండే ప్రహరీ గోడ వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఆలయంలో ఉండే రావి చెట్టుపై కాకులు వాలి పండ్లు తింటాయి. అవి తినే సమయంలో గింజలు గోడ మీద పడతాయి. సహజంగానే గోడ మీద ఉన్న పగుళ్లలో ఆ గింజలు పడి మొలకెత్తి మళ్లీ వృక్షంగా పెరుగుతుంది. ఫలితంగా గోడ మొత్తం బీటలు వారిపోతుంది. ముందే జాగ్రత్తపడి గోడపై పగుళ్లు లేకుండా చూసుకుని ఉంటే గోడ బీటలు పడే అవకాశం రాకుండా ఉంటుంది కదా! మనుష్యుల మనసులు కూడా రాతిగోడల వంటివి. ముందే జాగ్రత్తపడటం మంచిది. ఎంత మంచిగా ఉన్నా ముగ్గులోకి లాగే వాళ్లు ఉంటారు. అలాంటి వారికి మనమే దూరంగా ఉండటం మంచిది కదా’ అని అంటాడు అర్చకుడు.
www.facebook.com/bhagavadgithaa
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏